పల్లా రాజేశ్వర్ రెడ్డి 'కుక్క' వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్!

  • ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలపై పల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
  • సీఎంకు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా పల్లా వ్యాఖ్యలు ఉన్నాయన్న ముత్తిరెడ్డి
  • పల్లా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగేలా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణ స్థిరత్వం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించారన్నారు. పల్లా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవల పల్లా మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నావారు, ఇప్పుడు మనకు ఎందుకు సర్, ఇప్పటికే మనకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిని తీసుకోవడం ఎందుకని తాను కేసీఆర్ ను ప్రశ్నించానని, అందుకు కేసీఆర్ మాట్లాడుతూ.. వాళ్లు అవతలివైపు ఉండి కుక్కల్లాగా మాట్లాడుతున్నారని, ఆ కుక్కనే ఇటు వేస్తే పిల్లిలా అయిపోద్ది అని తనతో చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి.

muthireddy yadagiri reddy
palla rajeswar reddy
BRS
Congress

More Telugu News